అమరావతి పనులకు మళ్లీ ఊపు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
  • హరిత, నీలి నగరంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపిన సీఎం
  • కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఆదేశం
  • ఏపీలో మళ్లీ పెట్టుబడులపై విశ్వాసం పెరిగిందన్న ముఖ్యమంత్రి
  • ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో అమరావతి విద్యా కేంద్రంగా మారుతుందని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక, సీఆర్డీఏ, ఆర్థిక, అటవీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. అమరావతిని ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ హరిత, నీలి (గ్రీన్ అండ్ బ్లూ) నగరంగా, నివాసయోగ్యమైన (లివబుల్) నగరంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు అమరావతి నగరం నిలయంగా మారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. బిట్స్ పిలాని వంటి క్యాంపస్‌ల ఏర్పాటుతో ఇది కీలకమైన విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు మళ్లీ విశ్వాసం కలిగిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే రెన్యూ ఎనర్జీ వంటి సంస్థలు ఇంగాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తి కోసం అనకాపల్లిలో యూనిట్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాజధాని నగరాన్ని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే వంతెనను అత్యంత ఆకర్షణీయంగా, ఓ ఐకానిక్ నిర్మాణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Chandrababu
CRDA
Amaravati
AP Capital
TDP
Janasena
BJP

More Telugu News